రాజకీయాలు
నేను ఉన్నంతవరకు వాళ్లకు కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదు: సీఎం
రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!
- Sk.Islamuddin
- 05 మే, 2025
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంతవరకూ
కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబాన్ని రానివ్వనని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్
కుటుంబమే పెద్ద శత్రువు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో
ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన మీడియా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు
చేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు.. ప్రతి విమర్శలు
చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ జస్టిస్ ఘోష్ కమిషన్
ముందు హాజరయ్యారు. దీంతో ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేక
పోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే పెద్ద శత్రువని విమర్శలు చేశారు సీఎం రేవంత్
రెడ్డి. తాను ఉన్నంతవరకూ కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని
తెలిపారు. కవిత చేసిందంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామాను తలపిస్తోందని ఎద్దేవా
చేశారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకిగా
మారుతున్నారని మండి పడ్డారు. కేటీఆర్ చెప్పినట్టే కిషన్ రెడ్డి నడుచుకుంటున్నారని
తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
గద్దర్ అవార్డుల మొమెంటో రిలీజ్..!
తెలంగాణ ప్రభుత్వం దాదాపు పదకొండేళ్ల తర్వాత నంది అవార్డులను
ప్రకటించింది. ఈసారి "గద్దర్ అవార్డులు" పేరుతో అవార్డులను ప్రదానం
చేయనున్నారు. రీసెంట్ గానే 2024కు సంబంధించి అవార్డులను అనౌన్స్
చేశారు. అలానే 2014 నుంచి 2023 మధ్య వచ్చిన సినిమాలకు ఉత్తమ చిత్రం
విభాగంలో అవార్డులు ప్రకటించారు. ఈ నెల 14న హైటెక్స్ వేదికగా
అవార్డుల ప్రధానోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు
ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఈ నేపథ్యంలో తాజాగా గద్దర్ అవార్డుల
జ్ఞాపికను ప్రభుత్వం విడుదల చేసింది. జ్ఞాపికలో చేతికి రీల్
చుట్టుకున్నట్లుగా ఉండి.. పైన చేతిలో డప్పు పట్టుకున్నట్లుగా ఉంది.
ఆ డప్పు మీద తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించారు. కాగా గద్దర్
గుర్తుగా డప్పును ముద్రించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఫిల్మ్
డెవలప్మెంట్ కార్పొరేషన్, సినిమాటోగ్రఫీ శాఖ సంయుక్తంగా ఈ
చిహ్నాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గతంలో నంది అవార్డుల కంటే ఈసారి ప్రైజ్ మనీని భారీగా పెంచింది తెలంగాణ
సర్కార్. అవార్డుల్లో భాగంగా మొత్తం 73 పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం
అందించనుండగా.. ఇందుకోసం ప్రభుత్వం రూ. 4.5 కోట్లు ఖర్చు చేయనుందని సమాచారం. ఒక్కో
ఉత్తమ చిత్రానికి పురస్కారంతోపాటు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ లభించనుంది. అలాగే
వ్యక్తిగత అవార్డుల్లోనూ ఒక్కో పురస్కారానికి రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు చొప్పున
నగదు అందనుంది. అలాగే ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక అవార్డుకు రూ. 10 లక్షల
ప్రోత్సాహక నగదు లభించనుంది. ఈ వేడుకకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సీఎం
రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సినీ పరిశ్రమ ప్రముఖులు
హాజరుకానున్నారు.